టీఎస్ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం

  • ఆర్టీసీ ఉద్యోగులకు తమిళిసై శుభాకాంక్షలు
  • ప్రభుత్వ ఉద్యోగులుగా కొత్త రోల్ ప్రారంభించారంటూ వ్యాఖ్య
  • నెల రోజుల పాటు బిల్లును పరిశీలించిన గవర్నర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. దాదాపు నెల రోజుల పాటు బిల్లును నిశితంగా పరిశీలించి, న్యాయ సలహా తీసుకున్న తర్వాత గురువారం సంతకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా కొత్త రోల్ ప్రారంభించారంటూ వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే బిల్లును నిశితంగా పరిశీలించినట్లు వివరించారు. న్యాయ సలహా కోరడంలో బిల్లుకు ఆమోదం తెలపడం కాస్త ఆలస్యమైందన్నారు.
 
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. అసెంబ్లీ ఆమోదం తర్వాత గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపగా.. బిల్లులోని పలు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. ఉద్యోగుల పే స్కేల్ తో పాటు మొత్తం పది అంశాల్లో మరింత స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం పంపిన వివరణ పంపగా.. సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ తాజాగా బిల్లుపై సంతకం పెట్టారు.

Telangana
Rtc
Governor
Tamilisai Soundararajan
RTC Bill

More Telugu News